CM Revanth Reddy: వారితో కేసీఆర్ కు ప్రాణహాని.. సభలో రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |   ( Updated:2025-03-15 15:18:31.0  )
CM Revanth Reddy: వారితో కేసీఆర్ కు ప్రాణహాని..  సభలో రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) కుటుంబ సభ్యులతో ప్రాణహాని (life threatening) ఉందని, అందుకే ఆయన పోలీసుల పహార మధ్యలో ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ శాసనసభలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వారు తమ అజ్ఞానమే గొప్ప విజ్ఞానంగా, తెలివితక్కువ తనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని, వాటినే గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారన్నారు. గత ప్రభుత్వం మహిళా గవర్నర్‌ను అవహేళన చేసిందని ఆరోపించారు. 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు కొనసాగించిందని గుర్తుచేశారు. 2023లో కోర్టు కఠినంగా వ్యవహరించడంతో విధిలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి అనుమతి ఇచ్చిందని వివరించారు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తి సొంత ఆస్తి కాదని స్పష్టంచేశారు.

సమాధానం చెప్పలేకే మొఖం చాటేశారు..

కృష్ణానదిపై (Krishna Water) ప్రాజెక్టుల మొత్తం వివరాలు తీయాలని సీఎం రేవంత్ అన్నారు. ఎవరి హయాంలో ఆ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి? ఎవరి హయాంలో పూర్తయ్యాయి.. ఎవరు అన్యాయం చేశారో చర్చిద్దామన్నారు. కేసీఆర్‌ను సభకు రమ్మనాలని స్పీకర్‌ను కోరారు. ఈ సభలో కేసీఆర్ ఉండగానే కృష్ణాజలాలపై చర్చ పెడదాం.. తమ తప్పు ఉందని నిరూపిస్తే ఇదే సభలో కేసీఆర్‌కు, బీఆర్ఎస్ నాయకులు తాను క్షమాపణ చెప్తానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను పక్కన పెట్టడం వల్ల కృష్ణా నీటి విషయంలో తెలంగాణకు కేసీఆర్ మరణశాసనం రాశారని ధ్వజమెత్తారు. కేసీఆర్, హరీశ్‌రావు చంద్రబాబు ముందు మోకరిల్లారని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రాకుండా మొఖం చాటేశారన్నారు.

రూ.57,84,124 జీతం తీసుకున్నరు..

ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ (KCR) ఈ సభకు రెండు సార్లే వచ్చారని సీఎం వెల్లడించారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు రూ.57,84,124 జీతభత్యాలు తీసుకున్నారని వివరించారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ తెలంగాణ ప్రజలను వారి ఖర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి పార్టీ నాయకులను ఇలా తయారు చేసి పంపించారన్నారు. బీఆర్ఎస్ నేతలు రేబిస్ వ్యాక్సిన్ వికటించినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాశ్రేయస్సు కోసం విపక్షాలు సూచనలు చేస్తే స్వీకరిస్తామని సీఎం తెలిపారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి సున్నానే మిగులుతుందని హెచ్చరించారు.

బీఆర్ఎస్ వాకౌట్

సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారని, కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తామన్నారని ఆరోపించారు. అందుకే సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఆయన స్పీచ్‌ను బహిష్కరిస్తుట్లు చెప్పారు.


Also Read..

BREAKING: తెలంగాణ సెక్రటేరియట్‌పై డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు




Next Story

Most Viewed